టాలీవుడ్‌లో సమ్మె సైరన్: మే 1 నుంచి థియేటర్ల బంద్‌కు సిద్ధం

  • టాలీవుడ్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం
  • రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని థియేటర్ యజమానుల డిమాండ్
  • ప్రమాదంలో పడిన నిఖిల్, సమంత చిత్రాలతో పాటు పలు మే సినిమాలు
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల (థియేటర్ యజమానులు) మధ్య నెలకొన్న వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. ఆదాయంలో వాటా (రెవెన్యూ షేరింగ్) విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మే 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సమ్మర్ సీజన్‌లో విడుదల కావాల్సిన పలు క్రేజీ సినిమాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

ప్రస్తుతం ఉన్న రెంటల్ పద్ధతి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని థియేటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిర్వహణ ఖర్చులు, ఓటీటీల ప్రభావంతో ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో థియేటర్లు నడపడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. అందుకే, మల్టీప్లెక్స్‌ల తరహాలో వసూళ్లలో మొదటి వారం 60 శాతం రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం వాటా ఇచ్చేలా కొత్త రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఈ ప్రతిపాదనను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగాయని, ఈ సమయంలో రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేస్తే నిర్మాతలు మరింతగా నష్టపోతారని వారు వాదిస్తున్నారు. ఏప్రిల్ 30లోగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె ఖాయమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.

ఒకవేళ సమ్మె జరిగితే మే నెలలో విడుదల కావాల్సిన నిఖిల్ ‘స్వయంభూ’, సమంత ‘మా ఇంటి బంగారం’, ‘కొరియన్ కనకరాజు’, ‘సూర్య కరుప్పు’ వంటి చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ వివాదానికి త్వరగా ముగింపు పలకాలని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
 

Telugu Film Industry
Tollywood strike
theater strike
exhibitors association
revenue sharing
ATFPG
Nikhil Swyambhu
Samantha Ma Inti Bangaram
cinema release dates
film producers guild

More Telugu News